
- కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లోని మూడు గ్రామాలకు చెందిన 68 మందికి అస్వస్థత
- 23 కేసులు నమోదు, 18 టీఎఫ్టీ లైసెన్సులు రద్దు
బాన్సువాడ/కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లోని 4 గ్రామాలకు చెందిన 68 మంది సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 17 మందిని నిజామాబాద్, కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్స్కు తరలించారు. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ మండలం దామరంచకు చెందిన వారు కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు బాన్సువాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. కల్తీ కల్లుకు కారణమైన డిపోను సీజ్ చేయడంతో పాటు ఎక్సైజ్ అధికారులు 23 కేసులు నమోదు చేశారు. 18 టీఎఫ్టీ లైసెన్సులు రద్దు చేశారు.
శాంపిల్స్ ల్యాబ్కు పంపుతున్నాం
బాన్సువాడకు మంగళవారం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి వచ్చి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. దుర్కి డిపోలో కల్తీ కల్లు తయారు చేసి సప్లయ్ చేయడంతోనే 4 గ్రామాలకు చెందిన 68 మంది అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. దుర్కికి చెందిన సురేందర్గౌడ్, అతని తండ్రిని అరెస్ట్ చేశామన్నారు. సాయాగౌడ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. కల్లు శాంపిల్స్ ల్యాబ్కు పంపామని, రిపోర్టు వచ్చిన తరువాత నార్కోటిక్స్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు.
గౌరారంలో 9 మందికి..
గాంధారి మండలం గౌరారంలో కల్తీ కల్లు కలకలం రేపింది. మంగళవారం రాత్రి ఇక్కడ 9 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని బాన్సువాడ ఏరియా హాస్పిటల్కు తరలించారు. గ్రామంలో 3 రోజులుగా శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. పక్క ఊర్ల నుంచి బంధువులు వచ్చారు. కల్లు అందుబాటులో లేకపోవటంతో బాన్సువాడ ఏరియా నుంచి కల్లు తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. గ్రామాన్ని డీఎంహెచ్వో చంద్రశేఖర్, డీసీహెచ్వో విజయలక్ష్మి సందర్శించారు.